గెత్సేమనే తోటలో యేసు క్రీస్తు పడిన వేదన

సిలువ వద్దకు ఏడు అడుగులు: 1వ భాగము

ఇదేంటి ఏడడుగులు అని హిందువుల సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నాడేంటి అని నన్ను తిట్టొద్దు. 🙂 ఏడు అడుగులు అంటే యేసు క్రీస్తు సిలువ ప్రయాణంలో జరిగిన ఏడు ముఖ్యమైన సంఘటనలు అని భావించండి. గుడ్ ఫ్రైడే వస్తుందనగా అందరూ యేసు క్రీస్తు పలికిన యేసు పలికిన యేసు మాటలు గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. ఈ సందేశంలో మనం ఆ సిలువ ప్రయాణానికి దారి తీసిన పరిస్థితులు, ప్రజలు, ప్రభువు యొక్క మనసులో సంఘర్షణ, వీటన్నింటి గురించి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం సందేశం ఏడు భాగాలుగా మనం చూడబోతున్నాం. ఈరోజు మొదటి భాగం ధ్యానం చేద్దాం. ఆ దేవుడు మనకు తోడుగా ఉండును గాక.  

సిలువక వద్దకు యేసు క్రీస్తు చేసే ప్రయాణం కేవలం భౌతికమైనది లేదా శరీరసంభందమైనది మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ సంబంధమైనది. అది యేసు క్రీస్తు పడే బాధ, చూపించే విధేయత మరియు సాధించే అంతిమ విజయం ద్వారా మనకు తెలుస్తుంది. మనం ధ్యానించే ఈ ఏడు అడుగులు సందేశము ద్వారా, క్రీస్తు బలిదానం గురించి మనకు ఉన్న అవగాహనను మరింత పెంచుకుందాం మరియు దేవుడు మనకు నేర్పుతున్న పాఠాలను స్వీకరిద్దాం.

సమర్పణతో వచ్చే వేదన:

గెత్సేమనే అంటే “ఆలివ్ నూనె తీసే గానుగ” అని అర్థం. గెత్సేమనే అనేది తోట మాత్రమే కాదు, అది యేసుక్రీస్తు చేసిన ఒక గొప్ప ఆత్మీయ యుద్ధాన్ని చేసిన ప్రదేశం కూడా. లోకము యొక్క పాప భారం ఆయనపై పడబోతున్నప్పుడు, భయంకరమైన వేదన ఆయనను చుట్టుముట్టింది. లూకా సువార్తలో ఇలా వ్రాసి ఉంది, “ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.” (లూకా 22:45). వైద్య శాస్త్రంలో ఇది హీమాటిడ్రోసిస్ అని పిలువబడే ఒక అరుదైన పరిస్థితి, ఇది మనము చాలా తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. యేసు క్రీస్తు ఎదుర్కొంటున్న ఈ శారీరక పరిస్థితి ఆయన హృదయంలో ఎదుర్కొంటున్న గొప్ప వేదనను, సంఘర్షణను స్పష్టంగా తెలియజేస్తుంది.

యేసుక్రీస్తు ఎప్పుడూ తండ్రితో పరిపూర్ణ సహవాసంలో ఉన్నారు, కానీ ఇక్కడ, పాపం వలన త్వరలో తండ్రికి, ఆయనకీ వచ్చే ఎడబాటును బట్టి ఆయన మరింత మదన పడుతున్నారు. ఆయన మూడు సార్లు ప్రార్థించారు, మరేదైనా మార్గం ఉందా అని తండ్రిని అడిగారు: “నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా ఉండుడి” (మత్తయి 26:38). తన మానవత్వంలో, ఆయన గొప్ప భారంతో, భయంతో నిండినప్పటికీ, పూర్తిగా తండ్రి చిత్తానికి లోబడ్డారు: “అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.” (మత్తయి 26:39). ఈ సంఘటన చరిత్రలో ఒక గొప్ప మలుపు. సిలువపైకి వెళ్లే ముందే  యేసుక్రీస్తు విధేయత విషయములో ఇక్కడ విజయం సాధించారు.

ఆత్మీయమైన మరియు భావోద్వేగమైన బరువు

యేసు క్రీస్తు ఎదుర్కొబోయే ద్రోహం, కొరడాతో కొట్టుట, శిలువ వంటి శారీరక బాధల కంటే, ఆయన భరించాల్సిన గొప్ప బాధ ఉంది. అది లోక పాప భారం. “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను.” 2 కోరింథీయులకు 5:21 అని పౌలు రాశాడు. మనకోసం ఆయన పాప భారం మోయబోతున్నారు. ఇది ఎంతో క్రీస్తు మోస్తున్న భావోద్వేగమైన బరువు. పవిత్రుడైన ప్రభువు లోకపు పాపాన్ని తనపై తీసుకొని, పాపానికి చెల్లించాల్సిన శిక్షను భరించాల్సి వచ్చింది. తండ్రితో పరిపూర్ణ సహవాసాన్ని అనుభవించి ఆయన, శిలువపై “నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టితివి?” (మత్తయి 27:46) అని మొరపెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది.

అయితే గెత్సేమనెలో, యేసుక్రీస్తు దేవుని చిత్తముపై ప్రతిఘటన చేయలేదు; ఆయన చిత్తానికి విధేయత చూపించారు. తండ్రి ఆయనకు ఇచ్చిన పాత్రను త్రాగాలని నిర్ణయించుకున్నారు. అది దేవుని ఉగ్రతను మరియు తీర్పును సూచించే పాత్ర (యెషయా 51:17, ప్రకటన గ్రంథం 14:10). ఆయన శిష్యులు నిద్రపోతుండగా, ఈ ఆత్మీయ యుద్ధాన్ని ఆయన ఒంటరిగా ప్రార్థన ద్వారా ఎదుర్కొన్నారు.

గెత్సేమనెలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు

సమర్పణకు నమ్మకం అవసరం

యేసుక్రీస్తు వలె, మనం కూడా మన అభిరుచులు, ఇష్టాలు, మన ప్రణాళికలను దేవునికి అప్పగించాల్సిన అవసరం ఉంది. సమర్పణ అనేది ఏమి చేయకుండా అన్నీ వదిలేయడం కాదు అది దేవుని చిత్తము మంచిదనే నమ్మకంతో కూడిన నిర్ణయం తీసుకుని దేవునికి మనల్ని అప్పగించుకోవడం. 

ప్రార్థన విధేయతకు బలాన్నిస్తుంది

యేసు తన కష్టాన్ని ఒంటరిగా ఎదుర్కొనలేదు—ఆయన హృదయాన్ని ప్రార్థనలో కుమ్మరించాడు. మనం కూడా మన సొంత గెత్సేమనే క్షణాలను ఎదుర్కొన్నప్పుడు, దేవునిని ఆశ్రయించాలి. ఎందుకంటే, ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడే మనం ధైర్యాన్ని పొందగలము.

దేవుని చిత్తము మన భయాల కంటే గొప్పది

యేసు శిలువకు భయపడలేదు, ఎందుకంటే ఆయన దేవుని యొక్క గొప్ప ప్రణాళికని, లక్ష్యాన్ని అర్థం చేసుకున్నారు  అదే రక్షణ. అలాగే, దేవుడు మనలను ఏదైనా కష్టం ద్వారా నడిపించినప్పటికీ, అది నిరర్ధకమైనది కాదు. దాని విషయంలో దేవుని దగ్గర ఎదో ఒక ఉద్దేశ్యం ఉంటుంది. ఆయన అన్ని పరిస్థితులలోను, అన్ని విషయాలలోనూ  మంచి చేయగలరు. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. (రోమా 8:28).

చివరిగా, గెత్సేమనేలో యేసుక్రీస్తు బలహీనతను చూపించలేదు, ఆయన విజయాన్ని ప్రదర్శించారు. ఇక్కడే ఆయన భయాన్ని, వేదనను, బాధను అధిగమించి, శిలువను ఆలింగనం చేసుకుని, లోకానికి అత్యంత గొప్ప ప్రేమను పరిచయం చేసే పనిని ప్రారంభించారు. గెత్సమనే లో ఆయన పడిన బాధను, వేదనను మనం గమనించాము. మనం కూడా దేవుని చిత్తానికి లోబడి, ఆయన ప్రణాళికలు మన సంకల్పాల కంటే గొప్పవని నమ్మి, దేవునితో నడవడం మనం నేర్చుకోవాలి.

దేవుడు మిమ్మల్ని ఆశిర్వదించునుగాక!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *